Please enable javascript.భారత స్టాక్ మార్కెట్లు: Stock Markets : సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టాక్ మార్కెట్లు.. తొలిసారి 79 వేల మార్క్ దాటిన సెన్సెక్స్.. 24 వేల ఎగువకు నిఫ్టీ.. - indian stock markets create new record bse sensex touched 79000 mark nifty above 24000 mark | The Economic Times Telugu

Stock Markets : సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టాక్ మార్కెట్లు.. తొలిసారి 79 వేల మార్క్ దాటిన సెన్సెక్స్.. 24 వేల ఎగువకు నిఫ్టీ..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 27 Jun 2024, 2:06 pm

దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సెన్సెక్స్ మొట్టమొదటిసారి 79 వేల మార్క్ ను చేరుకుంది. నిఫ్టీ తొలిసారి 24 వేల స్థాయిని అధిగమించింది. మార్కెట్ల ర్యాలీకి గల కారణాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
stock markets

Representative Image


భారత స్టాక్ మార్కెట్లు రికార్డుల పరంపర కొనసాగిస్తున్నాయి. రిలయన్స్, ఐటీ స్టాక్స్ దన్నుతో సూచీలు ఇవాళ సరికొత్త జీవిత కాల గరిష్టాలను చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారి 79,000 మార్క్ ను దాటింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ మొదటిసారి 24,000 మార్క్ ను టచ్ చేసింది. త్వరలో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో సూచీలు కొత్త శిఖరాలకు చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సెన్సెక్స్ ఈరోజు 78,758 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒకానొక దశలో 79,240 పాయింట్లకు చేరింది. అయితే ఆ తర్వాత కాస్త తగ్గింది. ప్రస్తుతం 311 పాయింట్లు పెరిగి 78,993 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ ఈరోజు 23,881 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 24,036 స్థాయికి చేరింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. ప్రస్తుతం 74 పాయింట్లు పెరిగి 23,937 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 23 సెషన్లలోనే 1000 పాయింట్లు వృద్ధి చెంది 23 వేల మార్క్ నుంచి 24 వేల మార్క్ కు చేరుకుంది. ఇది నిఫ్టీ చరిత్రోలే రెండో అత్యంత వేగవంతమైన పెరుగుదల.

గత రెండు రోజులుగా రిలయన్స్ షేర్లతో పాటు ఐటీ స్టాక్స్ ను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో సూచీలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రిలయన్స్ షేర్లు ఈరోజు సరికొత్త 52 వారాల గరిష్టం రూ. 3,075 స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 1.1 శాతం పెరిగి రూ. 3,061 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైవు దిగ్గజ ఐటీ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, సొనాతా సాఫ్ట్ వేర్, ఎల్టీఐ మైండ్ ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కో ఫోర్జ్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్ వేర్, సైయింట్ లిమిటెడ్ షేర్లు 1.5 శాతం నుంచి 3 శాతం వరకు వృద్ధి నమోదు చేశాయి.

అలాగే ఇండియన్ సిమెంట్స్ లో అల్ట్రాటెక్ సిమెంట్ 23 శాతాను వాటాను కొనుగోలు చేయడం రెండు స్టాక్స్ పై సానుకూల ప్రభావం చూపింది. అల్ట్రా టెక్ షేరు ధర 4 శాతం పెరగగా, ఇండియా సిమెంట్స్ షేరు ధర 10 శాతానికిపైగా పెరిగింది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్ స్టాక్స్ నిఫ్టీ 50 వృద్ధిలో కీలకంగా మారాయి. ముఖ్యంగా బ్యాంక్స్, ఎఫ్ఎంసీ, మెటల్స్, ఫార్మా సెక్టార్ కు చెందిన స్టాక్స్ ను కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

మరోవైపు ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ కూడా ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 0.5 శాతానికిపైగా వృద్ది నమోదు చేశాయి.

వాల్యూయేషన్స్ పై ఆందోళనలు ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు భారత్ స్టాక్ మార్కెట్లు బుల్లిష్ గానే ఉంటాయని జియోజిత్ పైనాన్షియల్ సర్వీసెస్ డా. వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. సెన్సెక్స్ 80 వేల స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉందన్నారు. ఫండమెంటల్ గా బలంగా ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ర్యాలీ వల్లే మార్కెట్లు బుల్లిష్ గా ట్రెండ్ అవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా బ్యాంకింగ్, టెలికాం సెక్టార్లు కీలకంగా ఉన్నాయన్నారు.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More