Please enable javascript.రుణమాఫీ: Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ.. కటాఫ్ తేదీలివే.. - runa mafi telangana cabinet headed by cm revanth reddy approves rs 2 lakh farm loan waiver for farmers check cutoff dates | The Economic Times Telugu

Runa Mafi : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ.. కటాఫ్ తేదీలివే..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 22 Jun 2024, 12:08 pm

రైతులందరీ ఒకే దఫాలో రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీని ద్వారా 47 లక్షల మంది రైతులకు రుణ విముక్తి లభిస్తుందని తెలిపారు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

 
Runa Mafi

Representative Image


తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రూ. 2 లక్షల రుణమాఫీని ఒకే విడతలో పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ శుక్రవారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో పూర్తి చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు సీఎం తెలిపారు. 2022 మే 6న వరంగల్ లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణ మాఫీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ హామీని అమలు చేయబోతున్నామన్నారు. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరుతామని పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ తేదీలోపే రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

రుణమాఫీ కటాప్ తేదీలు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014, 2018 లో రుణమాఫీ చేసినట్లు రేవంత్ వివరించారు. మొదటిసారి రూ. 16 వేల కోట్లు, రెండో సారి రూ. 12 కోట్లు రుణమాఫీ అయినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 2018 డిసెంబర్ 11 ను కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో తీసుకున్న రూ. 2 లక్షల రుణాలను ఒకే విడతలో మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలుతో 47 లక్షల మంది రైతులకు రుణ విముక్తి లభిస్తుందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలను ఇకపై మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందిస్తారని పేర్కొన్నారు.
రైతు భరోసాపై జులై 15 లోపు నివేదిక
రైతు భరోసా అమలుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించనున్నట్లు రేవంత్ ప్రకటించారు. దీనికి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వం వహిస్తారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, రేవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. జులై 15 నాటికి ఈ కమిటీ నివేదిక అందిస్తుందని, దాని తర్వాత రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.

భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More