Please enable javascript.రుణమాఫీ అప్డేట్: Farm Loan Waiver Guidelines : మూడు రోజుల్లో రుణమాఫీకి మార్గదర్శకాలు.. రేషన్ కార్డు అవసరం లేదు.. - telanagana cm revanth reddy says rs 2 lakh farm loan waiver guidelines in 3 days ration card not required | The Economic Times Telugu

Farm Loan Waiver Guidelines : మూడు రోజుల్లో రుణమాఫీకి మార్గదర్శకాలు.. రేషన్ కార్డు అవసరం లేదు..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 29 Jun 2024, 11:55 am

రూ. 2 లక్షల రుణమాఫీకి రేషన్ కార్డు ప్రమాణికం కాదని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మరో మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 
Farm Loan Waiver Guidelines

Representative Image


రుణమాఫీ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్ మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. రుణమాఫీ పూర్తి చేసిన తర్వాత రైతు భరోసా, ఫించన్లను రూ. 4 వేలకు పెంచడంపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రూ. 2 లక్షల రుణమాఫీకి రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకోబోమని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని పేర్కొన్నారు.
ఒక్కో కుటంబానికి మొత్తంగా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. పంట రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. గోల్డ్ లోన్ ఈ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. కేవలం బ్యాంకర్ల కమిటీ, ఎస్ఎల్ బీసీ మార్గదర్శకాల ప్రకారం పంట రుణాలు తీసుకున్న రైతు కుటంబాలకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ఉంటుందన్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ ఇది వరకే తేల్చిచెప్పారు.

అలాగే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు.

దుర్వినియోగం
గత బీఆర్ఎస్ ప్రభత్వంలో రైతుబంధు నిధులు దుర్వినియోగం అయినట్లు వ్యవసాయ శాఖ రాష్ట్ర కేబినెనెట్ కు నోట్ అందజేసింది. 2018 లో ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి గత వానాకాలం సీజన్ ప్రభుత్వం రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఇందులో వ్యవసాయేతర భూములు కూడా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. సాగుకు యోగ్యం కాని కొండలు, గుట్టులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, హైవేలు, రోడ్లకు కూడా రైతు బంధు సాయాన్ని గత ప్రభుత్వం అందజేసినట్లు వెల్లడించింది. ఇలా మొత్తం 26,500 కోట్లు అనర్హులకు చెల్లించినట్లు వివరించింది. సగటున సంవత్సరానికి రూ. 4,416 కోట్లు దుర్వినియోగం అయినట్లు స్పష్టం చేసింది.

అయితే ప్రస్తుత ప్రభుత్వం సాగు భూములకే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయేతర భూములకు రైతుభరోసా సాయం అందకుండా కఠినమైన చర్యలు చేపట్టనుంది. గ్రామస్థాయిలో వ్యవసాయ భూములను గుర్తించి వాటికి మాత్రమే పంట పెట్టుబడి సాయం అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని భావిస్తోంది. అలాగే సంపనున్నలు, భూస్వాములకు ఈ సాయం నిలిపి వేయాలనే యోచనలో ఉంది. 5 లేదా 10 ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించే ఆలోచన కూడా చేస్తోంది. వీటిపై మరో మూడు రోజుల్లో స్పష్టత రానుంది. తెలంగాణలో 69 లక్షల మంది రైతులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 80 శాతం వరకు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే ఉన్నారు.

భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More